ప్రజాశక్తి-తిరువూరు
తిరువూరు పట్టణంలోని శ్రీవాహిని ఇం జనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి మేరుగు అన్వేష్(19) ఆత్మ హత్య చేసుకున్న సంఘటనపై అను మానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ స్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఏలూరు జిల్లా, ద్వారకా తిరుముల మండలం, కోడిగూడెం గ్రామానికి చెందిన చంద్రమ్మ, ఆనందరావు దంపతుల రెండవ కుమారుడు అన్వేష్ బిటెక్ మూడవ సంవత్సరం చదువుతూ కళాశాలలోని హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం తోటి విద్యార్థులు అందరు క్లాసులకు వెళ్లిన తరువాత 11 గంటల సమయంలో అన్వేష్ తలుపులు వేసు కుని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడి మతికి కారణం ఫీజు కట్టలేదని కళాశాల యాజమాన్యం వేధింపులేనని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని ఆదివారం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేశారు. రూ.50 వేలు ఫీజు కడితేనే పరీక్ష రాయినిస్తారంటే అప్పు చేసి రూ. 20 వేలు కట్టామని, నీవు తక్కువ కులం వాడివి, ఫిజు కట్టక పోతే వెళ్లి కూలి పనులు చేసుకోమని ప్రిన్సిపాల్ తోటి విద్యార్థుల ముందు హేళన చేసి మాట్లాడుతున్నారని మా అబ్బాయి తరచూ చెప్పేవాడని తల్లి విలేకర్ల ముందు బోరున విలపించింది. మృతుడి ఫోన్ ను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ దుర్గాప్రసాద్ చెప్పినా ఆందోళన విరమించలేదు. ఇరువైపుల పెద్దలు చర్చలు జరిపి అన్వేష్ తల్లిదం డ్రులకు రూ.5.50 లక్షలు ఆర్థిక సహా యం ఇస్తామని కళాశాల యాజమా న్యం చెప్పటంతో ఆందోళన విరమించారు.










