పిడిఎఫ్ పట్టపద్రుల ఎంఎల్సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు :ఉపాధ్యాయులు, ఉద్యోగుల జీతాలు సక్రమంగా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం తగదని, వేతన చెల్లింపుల్లో చోటు చేసుకుంటున్న జాప్యానికి గల కారణాలేమిటో ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని పిడిఎఫ్ పట్టభద్రుల ఎంఎల్సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమా వేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లింపులో అలసత్వం ప్రదర్శించలేదన్నారు. ఈ ప్రభుత్వ హయాంలోనే ఎప్పుడూ లేని విధంగా 20 వ తేదీ వరకు జీతాలు దశలు వారీగా చెల్లిస్తున్నారన్నారు. ఈ పద్ధతి సరికాదన్నారు. ఉపాధ్యాయుల,ఉద్యోగుల పిఎఫ్, ఎపిజి ఎల్ఐ, సిపిఎస్ ఖాతాలలో వారు చెల్లిస్తున్న డబ్బులు జమ చెయ్యకుండా వాటిని ప్రక్కదారి పట్టించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదన్నారు. ఇది ప్రభుత్వం ఆర్థిక క్రమశి క్షణారాహిత్యానికి నిదర్శనమన్మారు. పెన్షనర్లకు, పిఆర్సి అరియర్లకు మూడు వాయిదాలలో చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం నేటికీ ఆ ఊసే ఎత్తలేదన్నారు. కరువు భత్యం బకాయిలు 7 వాయిదాలు గత 4 సం లుగా వైసిపి ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందన్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించే సరండర్ సెలవులు, సంపాదిత సెలవులు ఎప్పుడు చెల్లిస్తారన్నది ఉద్యోగులకు, ఉపాధ్యా యులకు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు. పాదయాత్రలు చేసే సమయంలో సి పి యస్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చి నేడు సాధ్యం కాదని ఒకసారి, జి పి యస్ విధానం అమలు చేస్తామని మరో సారి ప్రభుత్వం ప్రకటించడం శోచనీయమన్నారు. ఓపిఎస్ అమలు చేయడం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వానికి సాధ్యం కాకపోతే పంజాబ్, రాజస్థాన్ ,ఛత్తీస్ గడ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్ లలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఎలా సాధ్యమైందిని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక ఎంతో అవసరమని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు,నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే పిడిఎఫ్ ఎంఎల్సి అభ్యర్దులకు గ్రాడ్యుయేట్ లు అందరూ మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు.
చిల్డ్రన్స్ పార్కు ప్రాంతంలో...
మార్చి 13వ తేదీన జరగనున్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ప్రచార హౌరు జోరందుకుంది. వైసిపి, పిడిఎఫ్ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తూ తమ గెలుపుకు అనుకూలంగా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నగరంలోని చిల్డ్రన్స్ పార్క్లో పిడిఎఫ్ శాసనమండలి పట్టబద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లు రెడ్డి,ఉపాధ్యాయుల అభ్యర్థి బాబు రెడ్డిలు సంయుక్తంగా తమ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పిడిఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి.. అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రజా సంఘాల నాయకులు కాయం శ్రీనివాసులు, పి.సూర్యనారాయణ, కట్టా సతీష్, అల్లంపాటి శ్రీనివాసరెడ్డి , జెకె పాణి, విద్యాచరణ్, సింగారెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో...
21వ డివిజన్ సిపిఎం శాఖ డివైఎఫ్ఐ, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం అనుబంధం (సిఐటియు) ఆధ్వర్యంలో నిరంతరం ప్రజల,ఉద్యోగులు సమస్యలపై పోరాడే నాయకులు పిడిఎఫ్ ఎంఎల్సి అభ్యర్థులను గెలుపుకోసం రవీంద్రర్నగర్, ఉమ్మారెడ్డి గుంట ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఎంఎల్సి ఎన్నికల్లో ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థులు (గ్రాడ్యుయేట్) అభ్యర్థి మీగడ.వెంకటేశ్వర్లురెడ్డి,(టీచర్స్) అభ్యర్థి పొక్కిరెడ్డి.బాబు రెడ్డి లకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు మనీ, డివైఎఫ్ఐ నాయకులు ముని, ఆటో కార్మిక సంఘం నాయకులు జనార్ధన్, శ్రీను, మురళి తదితరులు పాల్గొన్నారు. 11వ డివిజన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంఎల్సి ఎన్నికల ప్రచారం చేపట్టారు. నాయకులు పి .సూర్య నారాయణ, టి.నారాయణ, ఆవుల పెంచలయ్య, కర్తం బాబు, కత్తి చిన్న, కె.సుబ్బారావు, ఐ.శేషయ్య, ఆవుల ప్రశాంత్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.29, 31వ డివిజన్లలో రాజారాంరెడ్డి నగర్లో ప్రజాసంఘాలు ఎంఎల్సి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.










