పుట్టపర్తి అర్బన్ : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద రీసర్వే పనులను వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బసంత్ కుమార్ తెలియజేశారు. గురురువారం నాడు విజయవాడ సిసిఎల్ఎ కార్యాలయం నుంచి రీసర్వే, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై కలెక్టర్లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ చేతన్, ఇన్ఛార్జి డిఆర్ఒ భాగ్యలక్ష్మి, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 26 గ్రామాల్లో 13వ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. 13వ నోటిఫికేషన్ అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియలను సకాలంలో చేపడతామన్నారు. జిల్లాలో రీ సర్వే పనులు త్వరితగతిన చేపట్టేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్, గ్రౌండ్ వాల్యుడేషన్, తదితర ప్రక్రియలను వేగవంతం చేస్తామని తెలిపారు.
మొదటి దశలో ఎంపిఎఫ్సి గోడౌన్ల గ్రౌండింగ్ పూర్తి
జిల్లాలో మొదటి దశలో మంజూరైన ఎంపిఎఫ్సి(మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్) గోడౌన్లకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ అహ్మద్ బాబుకి కలెక్టర్ బసంత్ కుమార్ వివరించారు. గురువారం నాడు విజయవాడ నుంచి ఎంపిఎఫ్సి గోడౌన్ల నిర్మాణం, తదితర అంశాలపై రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు డిసిఒ కష్ణనాయక్, ఎడిసిసి బ్యాంక్ జనరల్ మేనేజర్ సురేఖ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపిఎఫ్సి గోడౌన్లకు సంబంధించి జిల్లాలో మొదటి దశలో 72 గోడౌన్లు మంజూరు అయ్యాయని చెప్పారు. వాటి గ్రౌండింగ్ను పూర్తి చేశామన్నారు. రెండవ దశలో 55, మూడవ దశలో 22 ఎంపిఎఫ్సి గోడౌన్లు మంజురుకాగా, దశలవారీగా వాటి గ్రౌండింగ్ చేపడుతున్నామన్నారు.










