Dec 08,2022 21:23

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

        పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం కింద వేగంగా రీ సర్వే పనులు చేపడుతున్నామని సిసిఎల్‌ఎ ప్రత్యేక అధికారి సాయి ప్రసాద్‌కు కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ తెలియజేశారు. గురువారం నాడు విజయవాడ సిసిఎల్‌ఎ కార్యాలయం నుంచి భూ హక్కు భూ రక్ష, భూ హక్కు పత్రాల పంపిణీ ప్రక్రియ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌, డిఆర్‌ఒ భాగ్యరేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ మిగిలినవి రీ సర్వే పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలన్నారు. సమస్యలు ఎదురైతే ప్రణాళిక బద్ధంగా పరిష్కరించుకుంటూ ప్రజలు సంతప్తిగా ఉండే విధంగా కొనసాగాలన్నారు. భూ హక్కు భూ రక్ష హక్కు పత్రాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని, వారంలోగా 22 పత్రాలు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. భూ సర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామని కలెక్టర్‌ ఆయనకు వివరించరు.
ఎంపిఎఫ్‌సి గోడౌన్లకు స్థల సేకరణ చేపడుతున్నాం
జిల్లాలో మూడవ దశలో మంజూరైన ఎంపిఎఫ్‌సి(మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్స్‌) గోడౌన్లకు స్థల సేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌ అహ్మద్‌ బాబుకు కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ వివరించారు. విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ తో పాటు డిసిఒ కష్ణ నాయక్‌, పశు సంవర్ధక శాఖ వైద్యుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మూడవ దశ లో 109 గోడౌన్లు మంజూరు కాగా 22 గోడౌన్లకు స్థల సేకరణ జరిగిందన్నారు. జగనన్న పాల వెల్లువకు సంబంధించి ఇప్పటికీ జిల్లాలో 23 గ్రామాలు పాల సేకరణ చేపడుతున్నామన్నారు. త్వరలో మరో 60 గ్రామాల్లో ప్రారంభిస్తామని అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వివరించారు.