పుట్టపర్తి అర్బన్ : ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనులను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో భవన నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్తో పాటు డిఆర్ఒ కొండయ్య, పంచాయతీరాజ్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, ఈఈ మురళిమోహన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిఆర్ ఇంజినీర్లు జవాబుదారీతనంతో పని చేయాలని ఆదేశించారు. ప్రాధాన్యత భవనాలైన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ సెంటర్ల పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పర్యవేక్షించాలన్నారు. అసిస్టెంట్లు ఇంజనీర్ రోజు మండలంలో తిరగాలన్నారు. నిర్మాణ పనులతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. మండల డివిజన్ అధికారులు నిర్మాణాలపై సమీక్షించుకోవాలన్నారు. భవన నిర్మాణ పనుల్లో వెనుకబడిన ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 245 రైతు భరోసా కేంద్రాలు, 269 వెల్నెస్ సెంటర్లు, 305 గ్రామ సచివాలయ భవనాలు, పూర్తి కావాల్సి ఉందన్నారు. వచ్చే సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డివిజన్ ఇంజనీర్లు కన్న మధుసూదన్, వెంకటరమణ, పద్మావతి, శ్రీనివాసులు, హరికష్ణ ఏఈలు శశి కుమార్, నాగరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు.










