Jan 10,2023 20:37

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌హొ:వైద్య, విద్య రంగాలకు వైసిపి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. మంగళవారం కొత్తపల్లె రెండవ వార్డులోని పూలతోట దళితవాడలో రూ 1.06 కోట్ల నిధులుతో అత్యాధునికంగా నిర్మించిన వైఎస్‌ఆర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. వేదపండితుల పూజలు, ముస్లిం మత పెద్దల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వైఎస్‌ఆర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది తగినంత స్థాయిలో ఉన్నారన్నారు. రాయచోటి పట్టణానికి నాలుగు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఒకటి ప్రారంభిస్తున్నామని మిగిలినవి త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. నాడు - నేడు పనులతో ప్రభుత్వాసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతులను కల్పిస్తామని పేర్కొన్నారు. పేదలకు ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలు మార్చిలో పూర్తవుతాయని చెప్పారు. ఆరోగ్య రంగంలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ గా నిలుస్తుందన్నారు. వైద్య రంగంలోరాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తోందన్నారు. కార్పొరేట్‌ కు ధీటుగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలను నిర్మిస్తున్నాని చెప్పారు. వైఎస్‌ఆర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కొత్తపల్లె వైఎస్‌ఆర్‌ పట్టణ ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో కలెక్టర్‌, ఎంఎల్‌ఎ మొక్కలు నాటారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష, డిఎంఅండ్‌హెచ్‌ఒ కొండయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లు, ఎపిఐఐసి డైరెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి, మాజీ చైర్మన్‌ చెన్నూరు అన్వర్‌బాష, కౌన్సిలర్‌ సుగవాసి పద్మావతి, సుగవాసి శ్యామ్‌, బేపారి మహమ్మద్‌ఖాన్‌, జమాల్‌ఖాన్‌, అలీ నవాజ్‌ ఖాన్‌, ఫజులాలీ, కొలిమిఛాన్‌ బాష, ఆసీఫ్‌ అలీఖాన్‌, ఫయాజ్‌ అహమ్మద్‌, జిల్లా వక్ఫ్‌ బోర్డ్‌ సభ్యులు జాకీర్‌ హుసేన్‌, నవరంగ్‌ నిస్సార్‌, సుగవాసి ఈశ్వర్‌ ప్రసాద్‌, అల్తాఫ్‌, జాఫర్‌ అలీఖాన్‌, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, ఆర్ట్స్‌ శంకర్‌, అయ్యవారు రెడ్డి, హజరత్‌ ఖాదర్‌ వలీ,రియాజుర్‌ రెహమాన్‌, మున్సిపల్‌ డిఇ సుధాకర్‌నాయక్‌, ఎఇ కృష్ణారెడ్డి, ఆర్‌ఐ మల్లికార్జున, జావిద్‌, అమీర్‌, కొత్తపల్లి ఇంతియాజ్‌ పాల్గొన్నారు.