ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు ఏరియా వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని ఎంఎల్ఎ మానుగుంట మహీధర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కందుకూరు ఏరియా వైద్యశాల అభివద్ధి కమిటీ సమావేశం మహీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏరియా వైద్యశాల రిసెప్షన్ కౌంటర్లో ఉన్న వ్యక్తి రోగుల పట్ల నిర్లక్ష్య భావనతో వ్యవహరించటం తాను స్వయంగా చూశానని చెప్పారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది ఆగౌరవంగా ప్రవర్తించటం సరికాదన్నారు. ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించి రోగుల పట్ల ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించమని కోరారు. సోమవారం రిసెప్షన్ కౌంటర్లో రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించని వ్యక్తిపై చర్యలు తీసుకుంటూ షోకాజు నోటీసు ఇవ్వాలని సమావేశంలో మహీధర్ రెడ్డి సూచించారు. రోగులకు అవసరమైన మందులు ఆసుపత్రిలో ఎందుకు ఉండటం లేదని ఆయన ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శకుంతల పాల్గొన్నారు.










