ప్రజాశక్తి - కదిరి టౌన్ : రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహన చోదకులు అప్రమత్తతతో ముందుకు సాగాలని కలెక్టర్ బసంత్ కుమార్ సూచించారు.జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్థానిక కాలేజ్ గ్రౌండ్లో పట్టణంలోని లారీ, మిని లారీ, ఆటో, టాక్సీ, స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ బసంత్ కుమార్, జిల్లా రవాణా అధికారి కరుణాసాగర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహన చోదకులు రహదారి భద్రత సూచనలు తప్పక పాటించాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు స్పందించి ప్రమాదానికి గురైన వారికి సహాయ సహకారాలు అందించి తగు వైద్య సదుపయాలు కల్పించగలిగితే మరణాల సంఖ్య తగ్గించ వచ్చునన్నారు. అలాగే స్పందించిన వారిని పోలీస్ వారి ద్వారా గాని వైద్య సిబ్బంది ద్వారా గాని ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా చట్ట సవరణ చేయడం జరిగిందన్నారు. అనంతరం కలెక్టర్ జెండా ఊపి రహదారి భద్రతావారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహనాల తనిఖీ అధికారి వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు, వాహన డీలర్లు, స్కూల్ బస్ యాజమాన్యం, లారీ, ఆటో, టాక్సీ డ్రైవర్లు, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.










