మాట్లాడుతున్న సిఐటియు నాయకులు
'ఉపాధి'ని నిర్వీర్యం చేసే కుట్ర
వలేటివారిపాలెం:ఉపాధి హామీ పథకంలో లొసుగులుపెట్టి, ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని సిఐటియు జిల్లా నాయకులు జీవీబీకుమార్ విమర్శించారు. మండలంలోని అంక భూపాలపురం, లింగపాలెం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను ఉద్దేశించి కుమార్ మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు ముఖ హాజరు ఉండాలని, సమ్మర్ అలవెన్స్ రద్దు చేయాలని, రెండు పూటలా పనిచేయాలని ఇలాంటి విధానాలను పథకంలో సష్టించి, పని నుండి కూలీలను వేరు చేసి, పొమ్మనకుండా పొగపెట్టే విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కూలీలందరూ సమైక్యంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను నిరసించాలని, సమైక్యంగా ఉద్యమాలు చేయాలని కోరారు. ఈ పర్యటనలో సిఐటియు మండల కార్యదర్శి సాధు చెన్నకేశవులతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్లు బి. మురళి,లక్ష్మీ నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.ఆశీర్వాదం, పి.మహేష్, కెవిపిఎస్ మండల నాయకులు మంగి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.










