చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్రెడ్డి
ప్రజాశక్తి- రాయచోటిహొ: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు-పేదలందరికీ పథకంలో భాగంగా జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, ఉగాదికి ఐదు లక్షలు ఇళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లను చీఫ్ సెక్రటరీ డా.జవహర్ రెడ్డి ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయం నుంచి రెవెన్యూ, అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్ధక, హౌసింగ్, విలేజ్, వార్డ్ సెక్రటేరియట్ గ్రీవెన్స్, గడపగడపకు మన ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ పథకాల అమలు పై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ సమీక్షించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుంచి కలెక్టర్ గిరీష్ పిఎస్, డిఆర్ఓ సత్యనారాయణ, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగాచీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ రబీ సీజన్లో ఈ క్రాప్ బుకింగ్ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా శత శాతం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న రైతులందరికీ పిఎం కిసాన్ పథకం వర్తించేందుకు రైతుల నుంచి ఇకెవైసి తప్పకుండా వేయించాలని సూచించారు. మైక్రో ఇరిగేషన్లో భాగంగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరికపై పూర్తి లక్ష్యం పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ మేలు చేస్తూ వారి ఆరోగ్యం కోసం అధిక పోషక విలువలు గల చేపలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. డొమెస్టిక్ మార్కెటింగ్ లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించేందుకు జిల్లాలో ఆక్వా హబ్లు, ఫిష్ వెండింగ్, రిటైల్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద జీవనోపాధి కోసం రుణాలు ఇప్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు పూర్తిపై అధికారుల ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్టేజ్ కన్వర్షన్ మీద ఫొటోస్ పెట్టాలని సూచించారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ రహదారుల పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో మంజూరైన పనులు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ ఉండాలన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర పోషించాలన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోగలుగుతామన్నారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ మత్స్య సంపద యువతలో స్వయం ఉపాధి కోసం 'ఫిష్ ఆంధ్ర మినీ ఫిష్ రిటైల్ ఔట్లెట్'లు ప్రతి మండలంలో ఒకటి చొప్పున ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిఆర్డిఎం పీడీని కలెక్టర్ ఆదేశించారు. రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్, పీఎం కిసాన్ ఇకెవైసి మీద ప్రత్యేక దష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. గడపగడపకు మన ప్రభుత్వంలో మంజూరైన పనులు గ్రౌండింగ్ పురోగతి కనిపించాలని సూచించారు.










