Jan 21,2023 20:33

మాట్లాడుతున్న ఎన్‌జిఒ నాయకులు

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : ఉద్యోగుల పెండింగ్‌ డిమాండ్లు ప్రఝభుత్వమే తీర్చాలని ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. శనివారం ఎన్జీవోహోంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్ల సాధన కోసం 72 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాడుతోందని చెప్పారు. ఇంతవరకు 11పిఆర్‌సిలు సాధించి అనేక రాయితీలు పొందామని పేర్కొన్నారు. 12వ పిఆర్‌సి సాధన కోసం అందరూ కలిసి పోరాడే సమయంలో గవర్నర్‌ను కలవడం వల్ల ఉద్యోగులు ఆందోళనకు గురవుతారని ఇది మంచి పద్ధతి కాదని ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్స్‌ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస్‌ రావు, ప్రధాన కార్యదర్శి కెవి శివారెడ్డితో చెప్పామని తెలిపారు. సూర్యనారాయణ సంక్రాంతి తోపా, దసరా తోఫా, రంజాన్‌ తోపా అని అనడం దారుణం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్జీవో హోమ్‌పైనా, సంఘాలపైనా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్యక్రమంలో రాయచోటి అధ్యక్షులు ఎం. వేణుగోపాల్‌ రెడ్డి, కార్యదర్శి డి.వెంకటేశ్వర్‌ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి అధ్యక్షులు కె బలరామరాజు, రాయచోటి కోశాధికారి నాగరాజు, ఉపాధ్యక్షులు మహమ్మద్‌ బాషా, మణికంఠ, జాయింట్‌ సక్రటరీ రామ్మూర్తి, మాధవ, ప్రతిభ కుమారి, వరలక్ష్మి, ఆర్గనైజేషన్‌ కార్యదర్శి పద్మజా పాల్గొన్నారు.