రాయచోటి : మదనపల్లి- పీలేరు జాతీయ రహదారి -71కు సంబంధించి త్వరితగతిన భూపరిహారం పంపిణీ చేయాలని కలెక్టర్ గిరీషా పిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్హాల్లో మదనపల్లి నుండి పీలేరు వరకు చేపట్టిన జాతీయ రహదారి-71 భూ పరిహార పంపిణీ అంశంపై ఆర్ డిఒలు, జాతీయ రహదారి అధికారులు, సంబంధిత తహశీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లి- పీలేరు వరకు చేపట్టిన జాతీయ రహదారికి అవసరమైన భూ సేకరణ చేశారని చెప్పారు వారంలోగా భూ పరిహార పంపిణీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీలేరు ప్రజలు బైపాస్ రోడ్డు త్వరగా ప్రారంభం చేయాలని కోరుతున్నారని, ఆదిశగా అధికారులు భూ పరిహార పంపిణీ త్వరగా పూర్తిచేసి ల్యాండ్ను ఎన్హెచ్ అధికారులకు అప్పజెప్పాలని ఆదేశించారు. సదరు భూమిని అప్పజెప్పిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలన్నారు. పరిహారం చెల్లింపునకు సంబంధించి తహశీల్దార్ల వద్ద ఫైల్స్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడూ పంపించాలని సూచించారు. రెవెన్యూ రికార్డులో ప్రకారంగా వివరాలు పక్కాగా ఉంటే వెంటనే పరిహారం పంపిణీ చేయాలన్నారు. ఎక్కడ కూడా ల్యాండ్ అక్వేషన్స్ పెండింగ్లో ఉండకూడదు అన్నారు. ఇంకను పరిహారం చెల్లించాల్సిన వివరాలను, సదరు డాక్యుమెంట్స్ ను పక్కాగా రూపొందించాలని చెప్పారు. ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు జాతీయ రహదారి (ఎన్హెచ్-42) పెండింగ్ భూ సేకరణ, పరిహార భూ పంపిణీ వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో రాయచోటి, మదనపల్లి ఆర్డిఒలు రంగస్వామి, మురళీ, సంబంధిత తహశీల్దార్లు, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.










