టిడిపి ఎంఎల్ఎలపై దాడి అమానుషం
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రతిపక్ష టిడిపి ఎంఎల్ఎలపై వైసిపి గూండాలు చేసిన దాడి అమానుషమని టిడిపి మండల కన్వీనర్ చింతనబోయిన బయన్న తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో శాసనసభలో అధికార పార్టీ ఎంఎల్ఎలు ప్రతిపక్ష ఎంఎల్ఎలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు ప్రాంతాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసిపి బలపంచిన అభ్యర్థులను ఓడించడంతో జీవించుకోలేని ప్రతిపక్ష ఎంఎల్ఎలపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని రాష్ట్ర చరిత్రలో ఈరోజును బ్లాక్ డేగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఫ్యాక్షనిస్టు మనస్తత్వం కలిగిన నాయకులు ఉండడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల మాజీ కన్వీనర్లు వెంకటస్వామి, బొజ్జ నరసింహులు, వెంకటేశ్వర్లు, ఆమ్ స్ట్రాంగ్ రాజు, మైనార్టీ నాయకులు షేక్ మహబూబ్ బాషా, బీసీ నాయకులు నరసింహారాజు, శివ కృష్ణ, రామ్మోహన్, జల్సా పాల్గొన్నారు.










