ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో క్యాంటిన్ గురువారం ప్రారంభమైంది. దీని నిర్వహణను వియంసి మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్కు కేటాయించారు. విఎంసిలో నడుస్తున్న క్యాంటిన్ గత కొంత కాలం నుంచి మూతపడిన విషయం తెలిసిందే. దీంతో మంచినీరు, టి, కాఫీ, టిఫన్, ఇతర ఆహార పదార్ధాలకు విఎంసి ఉద్యోగులు ఇబ్బందులకు గురౌతున్న విషయం తెలిసిందే. ఒకరిద్దరు ప్రయివేటు వ్యక్తులు అడపాదడపా కార్యాలయంలోని ఉద్యోగులు, అధికారుల వద్దకు టీ తీసుకొచ్చుకొని విడిగా విక్రయించుకుంటుండేవారు. దీని వల్ల క్యాంటిన్ లేకపోవడంతో విఎంసి ఉద్యోగులకు, వివిధ అవసరాల కోసం బయట నుంచి రోజు వారీ వచ్చే జనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి నేపధ్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు విఎంసి మినిస్ట్రీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్యాంటిన్ నిర్వహణ జరుగుతుంది. ఈ అవకాశం కల్పించిన మేయర్, కమిషనర్కు అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.










