తెల్లరాయి రవాణా జెసిబి, టిప్పర్ స్వాధీనం తనకు సంబంధం లేదంటున్న తహశీల్దారు

తెల్లరాయి రవాణా జెసిబి, టిప్పర్ స్వాధీనం
తనకు సంబంధం లేదంటున్న తహశీల్దారు
ప్రజాశక్తి -బాలాయపల్లి : పచ్చని పొలాల్లో సైతం తెల్లరాయిని అక్రమార్కులు లోడేస్తున్న సంఘటన తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం నాయుడు చెరువు కండ్రిక(పెండేరెడ్డిపల్లి)గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు కథనం మేరకు.. రాత్రి అయితే తెల్లరాయి దొంగలు అడవిలో చొరపడి సంపదను దోచుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు అండ దండలు పూర్తిగా ఉండడంతో తెల్లరాయి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అటవీ, ప్రభుత్వ భూములను సైతం వదలకుండా కనిపించిన చోట జెసిబితో అక్రమంగా తవ్వకాలు చేసి లక్షలు ఆర్జిస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు కావడం, ముఖ్య నేతల అండదండలు ఉండటంతో అటవీశాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. దీంతో తెల్లరాయి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి
క్వారీని నిర్వహించాలంటే ముందు మైనింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత తహశీల్దార్ ద్వారా ఎన్వోసీ తీసుకోవాలి. మైనింగ్ అధికారుల నుంచి అనుమతి లభించాక క్వారీ పనులు చేపట్టాలి. భూమి నుంచి వెలికి తీసిన రాయికి టన్నేజీ ప్రకారం విలువకట్టి ప్రభుత్వానికి రుసుంచెల్లించాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఇక్కడ తెల్లరాయిని తవ్వుతున్నారు. తద్వారా ప్రభుత్వానికి రావలసిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండికొడుతున్నారు.
సంబంధం లేదంటున్న తహశీల్దారు
మండలంలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా తెల్లరాయిని అనుమతులు లేకుండా తెల్లరాయి తవ్వకాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వస్తే వాహనాలు సీజ్ చేస్తున్నామని తహశీల్దారు తెలిపారు. పోలీసులకు అప్పగించకుండా వదిలేస్తున్నారు? మండల మేజిస్ట్రేట్ మీకు బాధ్యత లేదా?' అని అడిగితే తనకు సంబంధం లేదు.. మైనింగ్ వాళ్లదని మాట దాటవేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన వారే అలా మాట్లాడడం ఏమిటో తెలియడం లేదు. పట్టుకున్న జెసిబి, టిప్పరని పోలీసులకు అప్పగిస్తారో లేదో వేచి చూడాలి.