పుట్టపర్తి అర్బన్ : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జిల్లా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నామని కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. గురువారం విజయవాడ సచివాలయం నుంచి ముఖ్య కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్య, మహిళా శిశు సంక్షేమం, గడపగడపకు మన ప్రభుత్వం వివిధ ప్రభుత్వ పథకాలపై ముఖ్య కార్యదర్శి సమీక్షించారు. సుస్థిర అభివృద్ధిలో 8 ముఖ్యమైన అంశాలపై కషి చేయాలని కార్యదర్శి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ లక్ష్మి కుమారి, విద్యాశాఖ అధికారి మధుసూదన్, వైద్యాధికారి కుల్లాయప్ప నాయక్, తదితరులు పాల్గొన్నారు.
రీ సర్వే పనులు త్వరగతిన పూర్తి చేయాలి
ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తి చేయాలని, సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి సాయి ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్లో కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నాణ్యత ప్రమాణాల తనిఖీ, గ్రౌండ్ టు థింక్, డ్రోన్ ప్లేయింగ్ తదితర పక్రియలను వేగవంతం చేయాలన్నారు. సర్వేలో హద్దులు చూపించే రాళ్లు పాతే పనులు పూర్తి చేయాలని, 13 నోటిఫికేషన్ తదితర పనులలో పురోగతి కనిపించాలన్నారు. గడువులోగా ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రామకృష్ణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










