Dec 25,2022 19:34

సన్మాన గ్రహీతలతో మానవత సభ్యులు

ప్రజాశక్తి - రాయచోటి : సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదని వైసిపి మైనార్టీ నాయకులు బెపారీ మహమ్మద్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రతిభ జూనియర్‌ కళాశాలలో రాయచోటి మానవతా చైర్మన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నెలవారి సమావేశం నిర్వహించారు. కళాశాల అధ్యక్షులు కనపర్తి శివశంకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మహమ్మద్‌ ఖాన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫాయాజుర్‌ రహమాన్‌, గున్నికుంట్ల, గురిగుంజకుంట ఎంపిటిసి శ్రీధర్‌రెడ్డి, విశ్రాంత లెక్చరర్లు రహంతుల్లా, రెడ్డిమునిస్వామి హాజరయ్యారు. సంబేపల్లె మండలం గురిగింజకుంట హరిజనవాడకు చెందిన ఆదర్శ రైతు రెడ్డయ్యను మానవత సంస్థ అధ్వర్యంలో శాలువాతో సన్మానించి రూ.5,016 నగదుతో పాటు మానవత మెమొంటోను అతిథులు అందజేశారు. అతిధులుగా హాజరైన వారికి మానవత కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి మానవత మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవత స్వచ్ఛంద సంస్థ ద్వారా దాతల సహకారంతో వివిధ రకాల ఉచిత సేవలు అందజేయడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. మానవత సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ఒక ఉన్నతమైన ఆశయంతో సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందజేయడం చాలా గొప్ప విషయమన్నారు. మానవత స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిద రకాల ఉచిత సేవలు అందించేందుకు బేపారి మహమ్మద్‌ ఖాన్‌ రూ.30 వేలు, ఎంపిటిసి శ్రీధర్‌రెడ్డి రూ.25 వేల నగదును మానవత కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఈ సంస్థకు సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సంచుల ఖాదర్‌ బాషా, మానవత జిల్లా డైరెక్టర్‌ బ్రహ్మానంద రెడ్డి, సెక్రెటరీ వెంకట్రామరెడ్డి రెడ్డి,గౌరవ సలహాదారుడు వెంకటరమణ,కేంద్ర కమిటీ సహదేవ రెడ్డి, మాజీ సెక్రటరీ సుదర్శన్‌ రెడ్డిలతో పాటు మానవత సభ్యులు శ్రీధర్‌ రెడ్డి, మహబూబ్‌ బాషా, చిన్న, రవి మురళి, గంగాధర్‌ రెడ్డి, తాతి రెడ్డి పాల్గొన్నారు.