
శ్రీవారి ఆలయంలో
శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం
ప్రజాశక్తి- తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా 'దీపావళి ఆస్థానాన్ని' శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఛైర్మన్ ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేధించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఆస్థానంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, డిఎల్ఓ వీర్రాజు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఎస్ ఈ -2 జగదీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, విజివో నంద కిషోర్, పేష్కార్ శ్రీహరి, ఫార్పతేధార్ ఉమా మహేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.