అర్జీలు సమర్పిస్తున్న దృశ్యం
స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ద
నెల్లూరు:ప్రజల నుండి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ రోనంకి కూర్మనాధ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన స్పందన కార్యక్రమాన్ని సంయుక్త కలెక్టర్ రోనంకి కూర్మనాద్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను వారు స్వీకరించారు. అంతకుముందు సంయుక్త కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తున్నారన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు స్పందన లాగిన్లను తెరచి అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు.జిల్లాలో ఖాళీగా ఉన్న జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల పోస్టుల వివరాలను వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులందరూ అందజేయాలని ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ, మెప్మా పీడీలు కె.సాంబశివారెడ్డి, రవీంద్ర, జడ్పీ సీఈవో బి. చిరంజీవి, కె ఆర్ ఆర్ సి. ఎస్.డి.సి పూర్ణిమ, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, సి పి ఓ సాలెం రాజు, డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య, డిటిసి బి చందర్, భూ సర్వే రికార్డుల ఏడి హనుమాన్ ప్రసాద్, డి.ఎస్.ఓ వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఎస్.ఈ. లు రంగ వరప్రసాద్ అశోక్ కుమార్, గంగాధర్ జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, ఎల్ డి ఎం శ్రీకాంత్ ప్రదీప్ కుమార్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికార అధికారి రమాదేవి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.










