ప్రజాశక్తి- దేవనకొండ
ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోనప్పుడు సర్వసభ్య సమావేశాలు ఎందుకని ఎంపిటిసిలు తపాల శ్రీనివాసులు, తిమ్మప్ప, వెలమకూరు సర్పంచి భాస్కర్ ప్రశ్నించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపిపి లక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. ఎంపిటిసి తపాల శ్రీనివాసులు మాట్లాడుతూ... కుంకునూరు రెవెన్యూ పరిధిలో క్రాస్ రోడ్డు వద్ద 10.79 ఎకరాల ప్రభుత్వ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారని, ఇది రెవెన్యూ అధికారుల తప్పిదమని సభ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యకు సమాధానం చెప్పాల్సిన రెవెన్యూ అధికారులు హాజరు కాకపోవడం హాస్యాస్పదమన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నా ఆర్అండ్బి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒను కోరారు. ఎంపిడిఒ గౌరీదేవి మాట్లాడుతూ... వచ్చే సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్డబ్ల్యుఎస్ ఎఇ మురళీ విజరు మాట్లాడుతూ... జలజీవన్ మిషన్ కింద 20 గ్రామాల్లో ఇంటింటికీ కుళాయిల పథకం ద్వారా తాగునీరందిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎఒ సురేష్ బాబు మాట్లాడుతూ... ఈఏడాది ఖరీఫ్ సీజన్ కింద 74 వేల ఎకరాల్లో రైతుల పంటలు సాగు చేశారని తెలిపారు. తీవ్ర వర్షాభావంతో కరువు నెలకొనడంతో ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిందని చెప్పారు. కరువుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రబీ సీజన్లో హంద్రీనీవా కాలువల కింద రైతులు పంటలు సాగు చేసుకోవద్దని సూచించారు. ఇరిగేషన్ ఎఇ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... హంద్రీనీవా ద్వారా డిసెంబర్ నెలాఖరు వరకు మాత్రమే నీటి విడుదల ఉంటుందని, రైతులు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని రైతులకు తెలపాలన్నారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖపరమైన అభివృద్ధి పనులు, పనితీరును వివరించారు. ఎంఇఒ తిమ్మారెడ్డి, ఇఒఆర్డి సూర్యనారాయణ, సిహెచ్ఒ భాగ్యలక్ష్మి, ఎపిఒ కృష్ణమూర్తి, ఎపిఎం రమేష్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి లక్ష్మీదేవి