
ప్రజాశక్తి-మండపేట గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను మండల పరిషత్ సభ్యులు నిలదీశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపిపి ఉండమట్ల వాసు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ పనితీరును వ్యవసాయ అధికారి ఏసుబాబు వివరించారు. ఎంపిటిసి దేవీప్రసాద్ నాయుడు మాట్లాడుతూ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, కోతలు కోసుకుని ధాన్యాన్ని రోడ్లు, పుంతల మీద ఆరబెట్టుకుంటున్నారని చెప్పార. ఇప్పటివరకు రైతులకు గన్నీ బ్యాగులు అందలేదని, రైతు భరోసా కేంద్రానికి వెళుతుంటే సొసైటీకి వెళ్ళమని చెబుతున్నారని చెప్పారు. వాతావరణ మార్పులతో ఇబ్బందులు పడుతున్న రైతులు మరోసారి వర్షం వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ కుక్కల నిర్మూలనకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి తేమ శాతం హెచ్చు తగ్గుల నేపథ్యంలో రైతులు రైస్ మిల్లు, రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరు గుతున్నారన్నారు. అనంతరం ఎంపిపి వాసు, వైస్ ఎంపిపి వసుమర్తి నాగేశ్వరరావు మాట్లాడారు. రైతులకు మద్దతు ధర కల్పినకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ సిరిపురం శ్రీనివాస్, అన్నందేవుల చంద్రరావు, ప్రత్యేకాధికారి ఒ.రామకృష్ణ, తహశీల్దారు టిఆర్.రాజేశ్వరరావు, ఎంపిడిఒ ఐదం రాజు, డిప్యూటీ తహశీల్దారు పద్మ పాల్గొన్నారు.