సిఎం పర్యటన విజయవంతం చేయాలి
ప్రజాశక్తి-కావలి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావలి పర్యటనను అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, అధికారులను ఆదేశించారు. 12వ తేదీన కావలిలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, కలెక్టర్ ఎం.హరినారాయణన్, ఎస్పి తిరుమలేశ్వర రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఎంఎల్సి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎంఎల్ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలతో కలసి ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం ఆర్డిఒ కార్యాలయ సమావేశ మందిరంలో పలు శాఖల జిల్లా అధికారులతో సమావేశమై శాఖల వారీగా చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. అనంతరం మంత్రి గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను పరిశీలించారు. అనంతరం బహిరంగసభ ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దశాబ్ధాలుగా చుక్కల భూముల సమస్యతో బాధపడుతున్న రైతుల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి వాటి పరిష్కారానికి దారి చూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూములను 22/ఎ నుండి తొలగించారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఓవరాల్ ఇన్ఛార్జిగా జాయింట్ కలెక్టర్ బి.కూర్మనాధ్కు బాధ్యతలు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక, నుడా వైస్ ఛైర్మన్ టి.బాపిరెడ్డి, కావలి, ఆత్మకూరు ఆర్డిఒలు శీనా నాయక్, కరుణకుమారి, జెడ్పి సిఇఒ చిరంజీవి, డిపిఒ సుస్మిత, డిటిసి చందర్, డిసిహెచ్ఎస్ డాక్టర్ రమేష్నాథ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెంచలయ్య, జిల్లా ప్రజా రవాణా అధికారి శేషయ్య, డిఆర్డిఎ, డ్వామా, మెప్మా, ఎపిఎంఐపి పిడి లు సాంబశివారెడ్డి, వెంకట్రావు, రవీంద్ర, శ్రీనివాసులు, జిల్లా ఉద్యాన శాఖాధికారి సుబ్బారెడ్డి, డిఎస్ఒ వెంకటేశ్వర రావు, డిఇఒ గంగాభవాని, ఆర్.డబ్ల్యూ.ఎస్., పంచాయతీ రాజ్ ఎస్.ఇ.లు రంగవరప్రసాద్, అశోక్ కుమార్, కావలి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహశీల్దార్ మాధవరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.










