మృతిచెందిన సిఐ
సిఐ నాగేశ్వరరావు హఠాన్మరణం
ఆత్మకూరు అర్బన్:ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లి నాగేశ్వరరావు(48) గుండెపోటుతో మతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 2:30గంటలకు గుండె నొప్పిగా ఉందని ఆయన భార్యతో చెప్పాడు. వెంటనే ఆమె ఎస్ఐకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఎస్ఐ హుటా హుటిన అంబులెన్స్ తీసుకొని స్థానిక అభిరామ్ ఆస్పత్రికి సిఐని తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మూడు గంటల ప్రాంతంలో మతి చెందారని వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, కుమారుడు అంజనీ కుమార్ ఉన్నారు.సిఐ మృతిచెందడంతో భార్య కన్నీరుమున్నీరయ్యింది.
మృతుడు సిఐ పోలీస్ హెడ్ క్వార్టర్ మంగళగిరి నుంచి ఆర్నెల్ల క్రితం ఆత్మకూరు సిఐగా వచ్చారు. ఈ ఆర్నెల్లలు ఆత్మకూరు సర్కిల్ పరిధిలో విధి నిర్వహణలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. సాయంత్రం ఎస్పి విజయారావు ఆత్మకూరు పట్టణానికి చేరుకొని భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎఎస్పి హైమావతి, క్రైం ఎఎస్పి ప్రసాదరావు, ఆత్మకూరు డిఎస్పి కోటారెడ్డి, ఎస్ఐలు శివశంకరరావు, సాయి ప్రసాద్, ఆత్మకూరు ఆర్డిఒ కరుణ కుమారి, మున్సిపల్ కమిషనర్ ఎం.రమేష్ బాబు, తదితర రాజకీయ నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.










