- బైక్ ర్యాలీ ప్రారంభంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి
ప్రజాశక్తి - విలేకరులు: సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి పాల్గొన్నారు. కర్నూలు సిఐటియు ఆధ్వర్యంలో నేతాజీ టాకీస్ నుంచి ఎస్వి కాంప్లెక్స్ వరకూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. దేవనకొండలో నిర్వహించిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్ దేశారు పాల్గొన్నారు. గూడూరులో మున్సిపల్ కార్మికులు కమిషనర్కు సమ్మె నోటీసులు అందించారు. ఎమ్మిగనూరులో ఆశా వర్కర్ల సమావేశం, ఆటో ర్యాలీ బేతంచర్లలో వ్యకాస, రైతు సంఘం, సిఐటియు, డివైఎఫ్ఐ ఆధ్వర్యలో రౌండ్ టేబుల్ సమావేశం, కోడుమూరులో కార్మిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం, గోనేగండ్లలో సమావేశం నిర్వహించారు.
నంద్యాల : మోడీ ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం సిఐటియు కార్యాలయం నుండి చేపట్టిన బైక్ని ఆమె ప్రారంభించారు. ర్యాలీ ప్రభుత్వాసుపత్రి మీదుగా సాయిబాబా నగర్, టెక్కె, పద్మావతి నగర్, మున్సిపల్ ఆఫీస్, సంజీవ నగర్, ఆర్టీసీ బస్టాండ్, బంగారు అంగళ్ళవీధి, గాంధీ చౌక్, శ్రీనివాస సెంటర్ మీదుగా సాగింది. ధనలక్ష్మి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులను పెట్టుబడి దారులకు, కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా చేయాలని చూస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మివేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ఉద్యోగులంతా అనేక రూపాల్లో పోరాటం చేశారని, అయినా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని అన్నారు. పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సాయం చేయలేదు కేవలం చప్పట్లు కొట్టండి, దీపాలు ఆర్పండి, పూలు చల్లండని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసింది తప్ప ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు ఆర్థికంగా సహాయం చేయలేదని అన్నారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, కార్మికులకు, ప్రజలందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు కార్మికులు కలిసి ఐకమత్యంగా రెండు రోజుల పాటు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, అప్పుడే మోడీ ప్రభుత్వం మెడలు వంచగలరని పిలుపునిచ్చారు. 28న మార్కెట్ యార్డ్ నుండి శ్రీనివాస సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు వేలాది మంది కార్మికులతో జరిగే ర్యాలీ, సభను జయప్రదం చేయాలని, 29న బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు, వ్యకాసం జిల్లా ఉపాధ్యక్షులు సద్దాం హుస్సేన్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అధ్యక్షులు వి.ఏసురత్నం, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, పట్టణ కోశాధికారి వెంకట లింగం పాల్గొన్నారు. ఆత్మకూరు : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆత్మకూరులో సిఐటియు సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.రణధీర్, పట్టణ కార్యదర్శి డి.రాంనాయక్, ఎల్ఐసి యూనియన్ అధ్యక్షులు రమణయ్య, యూనియన్ బ్యాంకు నాయకులు గోవిందు, గిరిజన సంఘం నాయకులు నరసింహ నాయక్, ఎపి రైతు సంఘం అధ్యక్షులు మాబాషా, కార్యదర్శి సుధాకర్, వ్యకాసం నాయకులు ఎన్. స్వాములు మాట్లాడారు. ప్రజా సంఘాల నాయకులు చందావారి వెంకటేశ్వర్లు, మోటార్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి బి. ఎస్. వలి, ఎల్ఐసి యూనియన్ నాయకులు పుల్లయ్య, ఇస్మాయిల్, అమీర్ హంజ, నాగన్న, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి దినేష్ పాల్గొన్నారు.











