Mar 24,2022 23:03

గుంతకల్లులో సమ్మె బుక్‌లెట్లు ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-గుంతకల్లు    కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28, 29 తేదీలలో జరుగనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతునిచ్చి ఆటో కార్మికులు సత్తా చాటాలని సిఐటియు పట్టణ కార్యదర్శి సాకే నాగరాజు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని గురువారం స్థానిక పొట్టి శ్రీరాములు కూడలిలో సిఐటియు అనుబంధ భగత్‌సింగ్‌ ఆటో యూనియన్‌ నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక, కర్షకుల, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఆటో రంగం కుదేలు అయ్యేలా పెట్రోలు డీజిల్‌ గ్యాస్‌ ధరలను పెంచిందన్నారు. అంతేకాకుండా రవాణా రంగ కార్మికులపై భారీ జరిమానాలు వేసేందుకు జీవో 21 తెచ్చిందన్నారు. పెంచిన పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని, జీవో 21ని రద్దు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌ను జిఎస్టీ పరిధిలోకి తేవాలని, 50 ఏళ్లు దాటిన ఆటో కార్మికులకు 5 వేలు పెన్షన్‌ ఇవ్వాలని, లైసెన్స్‌ కలిగిన ప్రతి డ్రైవర్‌కి వాహనమిత్ర అమలు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం జరిగే సమ్మెలో ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తిమ్మప్ప, షబ్బీర్‌, భగత్‌సింగ్‌ ఆటో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం : స్థానిక ఆర్డీటీ ఆసుపత్రి వద్ద భగత్‌ సింగ్‌ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్‌ప్రసాద్‌, భగత్‌ సింగ్‌ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సిధ్ధప్ప, ఉపాధ్యక్షుడు రాము, కోశాధికారి అశోక్‌, అమనుల్లా, శ్రీనివాసులు, రాజా, వంశీ, సిద్దు, సురేష్‌, అంజి తదితరులు పాల్గొన్నారు.
తాడిపత్రి : ఈనెల 28 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సివిల్‌ సప్లై హమాలీ గోడౌన్‌ వద్ద సమ్మెకు సంబంధించిన బుక్‌లెట్‌లు విడుదల చేశారు. కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరసింహారెడ్డి, ఉమా గౌడ్‌, హనుమంతరెడ్డి, శంకర్‌, సూరి, సివిల్‌ సప్లై హమాలీలు పాల్గొన్నారు.
శింగనమల : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్‌ పిలుపునిచ్చారు. గురువారం సమ్మెకు సంబంధించిన బుక్‌లెట్లను ఆవిష్కరించారు. కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్‌, సిఐటియు మండల అధ్యక్షులు భారతి, కార్యదర్శి మురళి,ప్రమీల, వరలక్ష్మి, లక్ష్మీనారాయణరెడ్డి, ఎర్రిస్వామి, రామాంజనేయులు, సుంకన్న, బాషా, గిరి తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండ రూరల్‌ : ఈనెల 28, 29 తేదీల్లో చేపట్టిన దేశ వ్యాప్త సమ్మె విజయవంతం చేద్దామని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రంగారెడ్డి, మధుసూదన్‌, సిపిఐ నాయకులు చెన్నరాయుడు, వన్నూరు సాహెబ్‌, మల్లికార్జున, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.
పుట్లూరు : ఈ నెల 28, 29న చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కడవకల్లు గ్రామ సచివాలయం ఎదుట గురువారం కరపత్రాలు పంపిణీ చేశారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి, సిఐటియు మండల కార్యదర్శి విటి.రామాంజినేయులు, విఒఎ యూనియన్‌ నాయకులు సిద్ధయ్య, కార్మికులు చిన్న గుర్రప్ప, సుధారాణి, లక్ష్మీదేవి, ఆరాధన తదితరులు పాల్గొన్నారు.