పుట్టపర్తి రూరల్ : శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు శాఖ పని చేయాలని ఎస్పీ రాహుల్దేవ్సింగ్ సిబ్బందికి సూచించారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని ఎస్ఐలు ఆపైస్థాయి అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన కేసులు, పోలీసు శాఖ తీసుకున్న చర్యలపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితుల అరెస్టుల విషయంలో నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకలిగేలా సిబ్బంది పనితీరు ఉండాలన్నారు. అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ల అణచివేకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే స్పందన పిటీషనర్ల పట్ల మర్యాదగా వ్యవహరించి వారి సమస్య పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని తెలిపారు. కీలక కేసుల్లో ఘటనా స్థలంలోని ఆధారాలు సక్రమంగా, శాస్త్రీయ పద్ధతులలో సేకరించి దర్యాప్తు సమగ్రంగా చేపట్టాలన్నారు. కేసుల ఛేదింపులో సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కెవి.రామకష్ణ ప్రసాద్, డీఎస్పీలు ఉమామహేశ్వర రెడ్డి, యశ్వంత్, భవ్యకిషోర్, హుస్సేన్ పీరాతో పాటు జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.










