ప్రజాశక్తి - కౌతాళం
రైతులకు సాగునీరు సక్రమంగా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులకు సాగునీరందే వరకు తమ పోరాటం ఆగదని టిడిపి మంత్రాలయం ఇన్ఛార్జీ తిక్కారెడ్డి హెచ్చరించారు. గురువారం కౌతాళం మండలం కామవరం గ్రామం వద్ద ఉన్న ఎల్ఎల్సి హెడ్ రెగ్యులేటర్ దగ్గర మండల నాయకులు, రైతుల ఆధ్వర్యంలో వంటావార్పు చేసి, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులకు ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు. కనీసం తుంగభద్ర దిగువ కాలువ కింద సాగైన పంటలకు నీరందకపోవడంతో ఆ పంటలు కూడా ఎండుముఖం పట్టాయన్నారు. చేతికొచ్చిన పంటలు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సాగునీటి సమస్యపై జిల్లా మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇంటికి పరిమితమై రైతు సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వలస వెళ్లే నియోజకవర్గ మంత్రాలయమని తెలిపారు. నియోజకవర్గంలో సాగునీరందించి పంటలు కాపాడితే కొంతవరకైనా వలసలను నివారించవచ్చని చెప్పారు. రైతులకు న్యాయం చేయాలని అధికారులతో పంట పొలాలను పరిశీలించి, ఎల్ఎల్సి అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. తుంగభద్ర దిగువ కాలువలో పుష్కలంగా నీరున్నా రైతులకు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. అధికారులు రైతులకు సాగునీరందించి పంటలను కాపాడాలని కోరారు. లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, టిడిపి నాయకులు కోట్రేష్ గౌడ్, దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు సాయిబాబా, టిప్పు సుల్తాన్, కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్, జనసేన మండల అధ్యక్షులు రామాంజనేయులు, కాశీ విశ్వనాథ్, వెంకటరెడ్డి, రమేష్ గౌడ్, రాజాబాబు, ఉమేష్ గౌడ్, రంగస్వామి, నబిసాబ్, చిన్నభూంపల్లి నరసింహులు పాల్గొన్నారు.
వంటావార్పులో పాల్గొన్న తిక్కారెడ్డి, నాయకులు