రూ.36.11 కోట్లతో తిరుపతిలో నిర్మించనున్న... కేంద్ర కస్టమ్స్ కార్యాలయానికి భూమిపూజ

రూ.36.11 కోట్లతో తిరుపతిలో నిర్మించనున్న...
కేంద్ర కస్టమ్స్ కార్యాలయానికి భూమిపూజ
ప్రజాశక్తి-తిరుపతి టౌన్
జీఎస్టీ వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తిరుపతిలో నిర్మించనున్న సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ (జీఎస్టీ భవన్) నూతన కార్యాలయ భవనానికి భూమిపూజ గురువారం జరిగింది. తిరుపతి సీజీఎస్టీ కమిషనరేట్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 36.11 కోట్లతో బేస్మెంట్, గ్రౌండ్ఫోర్తో పాటు ఐదుఅంతస్తులతో కూడిన భవనం నిర్మాణం సిపిడబ్లుడి వారి ద్వారా చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. సిబిఐసి ఛైర్మన్ సంజరు కుమార్ అగర్వాల్ సంబంధిత అధికారులతో, సిబిఐసి సభ్యులతో కలిసి భూమిపూజ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తిరుపతి జిల్లాలో ప్రసార భారతి ఎదురుగా నూతన తిరుపతి సీజీఎస్టీ కమిషనరేట్ (జీఎస్టీ భవన్) కార్యాలయ నిర్మాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ తిరుపతి చాలా పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం అని, తిరుపతి సిజిఎస్టీ కమిషనరేట్ (జీఎస్టీ భవన్) కు భూమి పూజ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. తిరుపతి సిజీఎస్టీ కమిషనరేట్ వైజాగ్ జోనల్ చీఫ్ కమిషనరేట్ పరిధిలో ఉందని తెలిపారు. వైజాగ్ జోనల్ చీఫ్ కమిషనర్ వారు జీఎస్టీ వసూళ్లే కాకుండా కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని, రాష్ట్రంలో 975 కిలోమీటర్లు సాగరతీరం ఉందని బంగారం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వంటి వాటి నిరోధం వంటివి చేపట్టి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారికి శిక్షలు పడేలా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. తిరుపతి సిజీఎస్టీ కమిషనరేట్ పరిధిలో తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్య సాయి, కడప అన్నమయ్య జిల్లాలు ఉన్నాయని, ఇందులో ఎక్కువ శాతం మౌలిక సదుపాయాల పరిశ్రమలు, వివిధ పరిశ్రమల ద్వారా జీఎస్టీ వసూళ్లలో గణనీయమైన పురోగతి ఉందని తిరుపతి కమిషనరేట్ పని తీరును అభినందించారు. దీని పరిధిలో సుమారు 57,173 జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు ఉన్నారని తెలిపారు. గత సంవత్సరం ఒక్క జీఎస్టీ టాక్స్ కలెక్షన్లలో రూ. 8264 కోట్లగా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి రూ.5019 కోట్లను వసూళ్లు చేశారని, గత సంవత్సరాలను గమనిస్తే ఇది మూడు వందల శాతంగా వద్ధి ఉందని తెలిపారు. దీనికి ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్యాసింజర్ వాహనాల తయారీ పరిశ్రమలు, ఆటోమోటివ్ బ్యాటరీ పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు ప్రధానంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని తెలిపారు. శ్రీసిటీ పరిశ్రమల యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఒక ముఖ్య కారణం అని పేర్కొన్నారు. ఈ నూతన భవనం నిర్మితం అయితే ఏడాదికి 63 లక్షల రూపాయలు ఆదా అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబిఐసి చైర్మన్ సంజరు కుమార్ అగర్వాల్, జోనల్ సబ్యులు వివేక్ నిరంజన్, ఏడిజి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ రేంజ్ శిశిర్ భన్సాల్, వైజాగ్ జోన్ చీఫ్ కమిషనర్ సిజిఎస్టీ సంజరు పంత్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి తరపున చంద్రయాన్ 3 నమూనా జ్ఞాపికలను వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో సిజీఎస్టీ, సిబిఐసి సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. వాణిజ్య. పరిశ్రమల సీనియర్ మేనేజ్మెంట్ అధికారులు, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి పాల్గొన్నారు.
తిరుపతిలో సెంట్రల్జీఎస్టీ కమిషనరేట్ కార్యాలయానికి భూమిపూజ