Jan 31,2023 22:00

అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల వాగ్వాదం

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘం 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబందించి బడ్జెట్‌ను కనీస చర్చ సైతం జరపకుండా ఏక పక్షంగా రూ.174.48 కోట్లతో కౌన్సిల్‌ సభ్యులు ఆమోదం తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డిఎన్‌ ఇంద్రజ అధ్యక్షతన రెండు సమావేశాలు జరిగాయి. తొలుత ప్రత్యేక సమావేశం నిర్వహించి బడ్జెట్‌పై చర్చించారు. ఈ సందర్బంగా అధికారులు అన్ని పద్దులతో కలిపి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అయితే అంచనాలు, వాస్తవాలపై కౌన్సిలర్‌ నాగేంద్ర అభ్యంతరం తెలిపారు. బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన వెంటనే టిడిపి ఫ్లోర్‌ లీడర్‌ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ బడ్జెట్‌ కేవలం అంకెల గారిడీలా ఉందని ఆరోపించారు. బడ్జెట్‌లో ఎమ్మెల్యే నిధుల కింద రూ.5లక్షలు వస్తున్నట్లు అంచనాలు వేశారని. దీనిని బడ్జెట్‌ నుంచి తొలగించాలని కోరారు. దీంతో టిడిపి, వైసిపి కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ సహకారంతో నిధులను తీసుకోచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం సాధారణ సమావేశం అంటు 30 అంశాలతో కూడిన మరో అజెండాను ప్రవేశ పెట్టారు. వీటిపై చర్చించి, 29వ అంశం మినహా అన్ని అంశాలకు అమోదం తెలిపారు. దీంతో పాటు మరో టేబుల్‌ అజెండాను అధికారులు కౌన్సిల్‌ దృష్టికి తీసుకోచ్చారు. దీనిని సైతం సభ్యులు అమోదం తెలిపారు. అనంతరం ప్రజా సమస్యలపై చర్చించారు. చివరకు ఒక అంశం మినహా అన్ని అంశాలతో పాటు బడ్జెట్‌ అజెండాను ఆమోదం తెలిపినట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రకటించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర రావు, ఆయా శాఖల అధికారులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌కు సన్మానం : ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావును మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ చైర్మేన్లు జబివుల్లా, బలరామిరెడ్డితో పాటు కౌన్సిలర్లు కౌన్సిల్‌ హాలులో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారుతీరెడ్డి, ఇర్షాద్‌, మద్దన జయరాములు, గిరీష్‌, షాజియా, సునీత పాల్గొన్నారు.