May 03,2023 20:54

- మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష


ప్రజాశక్తి-రాయచోటి : రక్తహీనత రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ గిరీష అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్‌సిడి-సిడి సర్వే, ఎఎన్‌ఎం ఫీడ్‌ బ్యాక్‌, గ్రీవెన్స్‌, అనీమియా తదితర అంశాలపై వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న ఆహార అలవాట్లతో వయస్సు నిండకుండానే జీవనశైలి జబ్బులు చుట్టుముడుతున్నాయని పేర్కొన్నారు. వ్యాధి ముదిరిపోయే వరకు గుర్తించకపోవడంతో ప్రాణాంతకంగా మారుతున్నాయని తెలిపారు. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్‌ ఇండెక్స్‌(బిఎంఐ) సహా పలు రకాల స్క్రీనింగ్‌ పరీక్షలను ఎఎన్‌ఎంలు ఇంటింటికీ తిరిగి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎన్‌సిడి సర్వేలో గుర్తించిన అసాంక్రమిక వ్యాధుల బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఎన్‌సిడి స్క్రీనింగ్‌తో పాటు ప్రజలకు డిజిటల్‌ ఆరోగ్య ఐడీని ఆరోగ్య కార్యకర్తలు త్వరగా పూర్తి చేయాలన్నారు. స్క్రీనింగ్‌లో వెల్లడైన ఆరోగ్య వివరాలను ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు.హెల్త్‌ ఐడి జనరేట్‌ వారం వారం ప్రోగ్రెస్‌ కనపడేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ఎన్‌సిడి-సిడి సర్వేలో భాగంగా జీరో నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వివరాలను నమోదు చేయాలన్నారు. అందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి తప్పకుండా నమోదు చేయించాలన్నారు. జిల్లాను రక్తహీనత లేని జిల్లాగా మార్చేందుకు వైద్య అధికారులు కషి చేయాలని సూచించారు. గర్భిణులకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు తప్పులు లేకుండా జాగ్రత్తగా చేయాలన్నారు. హెచ్‌ బి శాతం మైల్డ్‌గా ఉన్న నెంబర్‌ను నార్మల్‌కు తీసుకురావాలన్నారు. సివియర్‌గా ఉన్న వారి పట్ల ప్రత్యేక వైద్య సేవలు అందించాలన్నారు. కోవిడ్‌ పరీక్షలు ఆర్‌ టిపిసియర్‌ లో మాత్రమే చేయాలన్నారు. ఎఎన్‌ఎం ఫీడ్బ్యాక్‌ గడువులోగా పరిష్క రించాలన్నారు. సమీక్షలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య, వైద్యాధికారులు పాల్గొన్నారు.
పట్టణ పిహెచ్‌సిలో కలెక్టర్‌ తనిఖీ : స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ గిరీష సందర్శించి ఒపి, మందుల నిల్వ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం పైన అవగాహన కల్పించాలన్నారు.