ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పురుషోత్తమ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రక్తదానం యొక్క ప్రాధాన్యతను, గొప్పతనమును తెలుసుకోవాలని సూచించారు. రక్తదానం చేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారవుతారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు రక్తదానం చేసి తమ స్పూర్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో రిమ్స్ బ్లడ్ బ్యాంక్, రాజంపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం సౌజన్యంతో నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ కె.చంద్రకళ, ఐసిటిసి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎన్సిసి ఆఫీసర్ మేజర్ విజరు భాస్కర్ పర్యవేక్షణలో విద్యార్థులు సహకారం అందించారు. కార్యక్రమంలో పలువురు కళాశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.










