న్యూఢిల్లీ : రాబోయే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) సోమవారం తెలిపింది. వాయువ్య మధ్యప్రదేశ్లో వర్షాలు తగ్గనున్నాయని వెల్లడించింది. ఇక మరో తుఫాను ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనుందని హెచ్చరికలు జారీ చేసింది. జూలై 28న ఏర్పడే అల్ప పీడన ప్రభావం వల్ల పొరుగు ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయని సూచించింది. అల్ప పీడన ప్రభావం వల్ల జమ్మూకాశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో జూలై 29 వరకు భారీ వర్షపాతం నమోదవ్వనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే జూలై 27, 28 తేదీలలో హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, వాయువ్య ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అలాగే ఒడిశా, పశ్చిమబెంగాల్లలో కూడా విస్తారమైన వర్షపాతం నమోదు కానుందని పేర్కొంది. జూలై 29వ తేదీన మహారాష్ట్రలో ఘాట్ ప్రాంతమైన కొంకణ్ ప్రాంతాలలోనూ, గోవాలోనూ విస్తృతమైన వర్షపాతం నమోదవ్వనుందని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే రెండు వారాలుగా మహారాష్ట్రలో సంభవించిన వరదల వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలిసిన విషయమే.