Jan 17,2023 18:39

మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి-రాయచోటి : జిల్లాలో జరుగుతున్న రీ సర్వే నందలి ముటేషన్స్‌, ఖాతా కరెక్షన్స్‌, ఇకెవైసి, ఫీల్డ్‌ పిఓఎల్‌ఆర్‌ తదితర మాడ్యూల్స్‌ను గడువులోపు వంద శాతం పరిష్కరించాలని కలెక్టర్‌ గిరీష ఆర్‌డిఒలు, తహశీల్దారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి రీ సర్వే, ఫీల్డ్‌ పిఒఎల్‌ఆర్‌, అసైన్మెంట్‌ ల్యాండ్‌, శ్మశానవాటికలు, బిఎస్‌ఎన్‌ఎల్‌కు స్థల కేటాయింపు, హౌస్‌ సైట్స్‌ జారీ, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు జాబితా పెండింగ్‌ క్లైమ్స్‌ పరిష్కారం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ క్లెయిమ్స్‌ పరిష్కారం తదితర అంశాలలో ఆర్‌డిఒలు, తహశృల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 26 గ్రామాలలో మ్యుటేషన్స్‌, ఖాతా కరెక్షన్స్‌, క్లరికల్‌, డిజిటల్‌ సిగేచర్‌ తదితర నాలుగు రకాల మాడ్యూల్స్‌ పూర్తి చేశామన్నారు. 34 గ్రామాలలో మ్యుటేషన్స్‌ పరిష్కారం, 9 గ్రామాలలో మ్యుటేషన్స్‌, ఖాతా కరక్షన్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సంబంధిత ఆర్‌డిఒలు, తహశీల్దార్లు ఒకటి, రెండు మాడ్యూల్స్‌ మాత్రమే పెండింగ్‌లో ఉన్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వచ్చే వారంలోగా తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. 71 శాతం ఇకెవైసి పూర్తి చేశారని వంద శాతం పూర్తి చేసేలా ఆర్డీవోలు తగు దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలోని 465 గ్రామాలలో 81 గ్రామాలలో మాత్రమే ఫీల్డ్‌ పిఒఎల్‌ఆర్‌ ప్రక్రియను ప్రారంభించారని మిగిలిన అన్ని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలన్నారు. విఆర్వోలు అందరూ ఫీల్డ్‌ పిఒఎల్‌ఆర్‌ను పూర్తిచేసే విధంగా ఆర్డీవోలు ప్రత్యేక దృష్టి పెట్టి తగు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆయా డివిజన్లో ఎంతెంత అసైన్మెంట్‌ ల్యాండ్‌ ఉందన్న వివరాలను వెంటనే జిల్లా సచివాలయానికి పంపించాలని రాజంపేట సబ్‌ కలెక్టర్‌, రాయచోటి, మదనపల్లి ఆర్డీవోలను ఆదేశించారు. శ్మశాన వాటికలకు స్థల కేటాయింపులో భాగంగా ఆయా డివిజన్ల నుంచి ఇప్పటికే వచ్చిన 150 ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఇంకనూ 54 ప్రతిపాదనలు రావాల్సి ఉందని, వచ్చే శుక్రవారం లోగా ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్మశాన వాటికలకు స్థల కేటాయింపులకు అనుమతులు జారీ చేసిన వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు స్థల కేటాయింపును ఈ వారంలో పూర్తి చేయాలన్నారు. హౌస్‌ సైట్స్‌ జారీకి సంబంధించి పొజిషన్‌ సర్టిఫికెట్లు జారీ చేసి ఇకెవైసి పూర్తి చేయాలన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు జాబితా పెండింగ్‌ క్లెయిమ్స్‌ జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలని, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ లో పెండింగ్‌ ఉన్న 13,600 క్లెయిమ్స్‌ను కూడా పరిశీలించి 10 రోజుల్లో పూర్తిగా పరిష్కరించాలని చెప్పారు. ఉద్యోగుల హాజరు నమోదుకు సంబంధించి ప్రభుత్వ ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌-యాప్‌ను అందరూ డౌన్లోడ్‌ చేసుకొని ఎన్రోల్‌ అయి ప్రతిరోజు హాజరు వేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలలో తగు సూచనలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ సత్యనారాయణ, కలెక్టరేట్‌ ఎఒ బాలకృష్ణ, సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.