ప్రజాశక్తి - మడకశిర (శ్రీ సత్యసాయి జిల్లా) : బిజెపి పాలన పోతేనే దేశం అభివృద్ధి చెందుతుందని సిడబ్ల్యుసి సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా మండకశిర మండల పరిధిలోని నీలకంఠాపురం గ్రామంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి కనుమరుగై కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే 'పోలవరం' పనులు చేపట్టినా.. ఆ తర్వాత మిగిలిన పనులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిడిపి, వైసిపి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తద్వారా పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎపిలో నీటి కొరత తీరుతుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, కాంగ్రెస్ కన్వీనర్లు మందలపల్లి నాగరాజు, లోకేష్, మంజునాథ్, గౌడప్ప, నాయకులు కెటి శ్రీధర్, బి నరసింహమూర్తి, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.










