Jan 31,2023 21:24

ఫొటో : గిరిజన రైతులకు పట్టలు అందజేస్తున్న దృశ్యం

రైతులకు శిక్షణ
ప్రజాశక్తి-మర్రిపాడు : భారతీయ ఉద్యానవన పరిశోధనా సంస్థ, బెంగళూరు, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు వారు సంయుక్తంగా హరిజన, గిరిజన ఉప ప్రణళికలో భాగంగా ఉద్యానవన పంటల సాంకేతికపై మంగళవారం రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ జి.ఎల్‌.శివ జ్యోతి పాల్గొని మాట్లాడుతూ రైతులందరూ సాంకేతికతపై అవగాహన కలిగి ఉండి, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని, ఈ ఉప ప్రణాళికలో భాగంగా ఇస్తున్న ఇన్పుట్స్‌ ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్‌ టి హెచ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఐఐహెచ్‌ఆర్‌లో దీర్ఘకాలికంగా కూరగాయలు, ఉద్యానవన పంటలు పరిశోధనలు జరుపుతున్నారని, ఇప్పటి వరకు దాదాపుగా 143 రకాల కొత్త వంగడాలను విడుదల చేశారన్నారు. శాస్త్రవేత్త డాక్టర్‌ నరేష్‌ మాట్లాడుతూ వైరస్‌ తెగుళ్లను తట్టుకునే కొత్త రకం మిరప వంగడాలను రైతులు సాగు చేయాలని సూచించారు.
మిరప పంటను వైరస్‌ బారినుండి కాపాడటానికి సమగ్ర సస్య రక్షణ పద్ధతిని అవలంబించాలని తెలి. ఈ ఉప ప్రణాళిక నెల్లూరు జిల్లా రైతు సోదరులకు వినియోగ పడేలా నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్‌ జి.నారాయణ స్వామి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుజాత రైతులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ డి.విజయకుమార్‌ నాయక్‌, డాక్టర్‌ కె.కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పంటల తెగుళ్లు, పోషకాల యాజమాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐఐహెచ్‌ఆర్‌ డాక్టర్‌ సింగ్‌, డాక్టర్‌ నరేష్‌ రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.