Nov 10,2023 19:57

లూకా పాసియోలికి నివాళులర్పిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలోని రావూస్‌ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ అకౌంటింగ్‌ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల సిఇఒ తిరుమలరెడ్డి అధ్యక్షతన కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఇర్ఫాన్‌, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి విజరు కుమార్‌ మాట్లాడారు. లూకా పాసియోలి అకౌంటింగ్‌ విధానంలో జంట పద్దు విధానాన్ని ప్రవేశపెట్టి అకౌంటింగ్‌ సబ్జెక్టు రూపకల్పనకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. నేడు మారుతున్న సాంకేతికత వల్ల వివిధ వ్యాపారాలు ఈ-కామర్స్‌ విధానంలో, డిజిటల్‌ చెల్లింపు ద్వారా జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఆధునిక టెక్నాలజీలో అకౌంటింగ్‌ ప్రాధాన్యత చాలా ఉందని, జిఎస్‌టి రాకతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు అకౌంటెన్సీ సబ్జెక్టు పట్ల శ్రద్ధ చూపుతూ వివిధ పరిశోధనల వైపు వెళ్లాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్‌ ప్రకాష్‌, నోడల్‌ ఆఫీసర్‌ రాఘవేంద్ర, వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు వీరేష్‌, మనోహర్‌, విజయరాజు పాల్గొన్నారు.