పీలేరు : కేసుల పరిష్కారంలో రాజీమార్గమే రాజమార్గమని పీలేరు సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీనివాసులు నాయక్ తెలిపారు. శనివారం కోర్టు ఆవరణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలు క్షణికావేశంలో చేసే పొరపాట్ల కారణంగా పరిస్థితి పోలీసు కేసుల వరకు దారి తీస్తుందని తెలిపారు. అయితే కాస్త సంయమనం పాటించి, సహనంతో ఉంటే కేసులకు దూరంగా ఉండి స్నేహపూర్వక వాతావరణంలో జీవనం సాగించవచ్చన్నారు. ప్రజలు కక్షలకు, కార్పణ్యాలకు తావివ్వకుండా కలిసి, మెలిసి బతకడంలోనే ఎంతో ఆనందం ఉందని సూచించారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసుల్లో కక్షి దారులు తిరిగి కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉండదన్నారు. అనంతరం జరిగిన లోక్ అదాలత్ లో సీనియర్ సివిల్ జడ్జి పలు కేసులు పరిష్కరించారు. ఈ సమావేశంలో పీలేరు ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శారద, సిఐ మోహన్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎండి రఫీ అన్సారి, లోక్ అదాలత్ సభ్యులు రాజేంద్ర బాబు, ఇతర న్యాయవాదులు, కక్షి దారులు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకుని రేగళ్ళు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బ ందం కోర్టు ఆవరణంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి, పలువురికి ప్రాథమిక వైద్య సేవలు అందించింది. టిబి సూపర్వైజర్లు మోహన్, పవన్ కుమార్, సిహెచ్ఓలు సుస్మిత, చంద్రలేఖ, ఆశ కార్యకర్తలు శ్రీదేవి, సుమలత, రేణుక, వీరకుమారి పాల్గొన్నారు.










