Jun 15,2023 21:32

మాసాపేట సబ్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న ఎస్‌ఇ రమణ

రాయచోటి : జిల్లా వ్యాప్తంగా గడప గడపకూ మన మన ప్రభుత్వంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కడప సర్కిల్‌ సర్వోన్నతాధికారి ఎస్‌.రమణ పేర్కొన్నారు. గురువారం స్థానిక విద్యుత్‌ కార్యాలయంలో రాయచోటి డివిజన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలో విద్యుత్‌ సరఫరా ఆలస్యంపై చర్చించారు. వినియోగదారులతో సమన్వయ సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. 33/11 కెవి మాసాపేట సబ్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. వేసవిలొ తీసుకోవాల్సిన చర్యల గురించి కొత్తగా అమర్చిన 8.0 ఎంవిఎ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. రాయచోటి పశ్చిమ విభాగానికి సంబంధించిన ఆఫీసును పరిశీలించి సిబ్బందితో రాయచోటి టౌన్‌లో అడిషనల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, గడప గడపకూ మన ప్రభుత్వంలో వచ్చిన ఫిర్యాదులపైన త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తరువాత నారాయణరెడ్డి పల్లె దగ్గర కొత్తగా నిర్మిస్తున్న 33/11 కెవి సబ్‌ స్టేషన్‌ పరిశీలించారు. కార్యక్రమంలో డివిజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వై.చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు తిరుపాల్‌ నాయక్‌, చిన్నస్వామి నాయక్‌, రామచంద్రారెడ్డి, అన్ని మండలాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.