Jan 19,2023 20:38

- వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ గిరీష, అధికారులు


 రాయచోటి : ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు సంతృప్త స్థాయిలో అందేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడలోని రాష్ట్ర సచివాలయం నుంచి రీ సర్వే, జాతీయ రహదారులకు భూసేకరణ, స్పందన గ్రీవెన్స్‌, ఎపిఐఐసి భూముల మ్యుటేషన్స్‌, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధకం, మత్స్యశాఖ, గహ నిర్మాణంలో ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణం, గ్రామ వార్డు సచివాలయాలు, గడప గడపకూ మన ప్రభుత్వం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌లోని మినీ విసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ గిరీష పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ జిల్లాలో సుస్థిర సమగ్రాభివద్ధి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అందరూ సమన్వయంగా కషి చేయాలన్నారు. రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. ఫైనల్‌ ఆర్‌ఒఆర్‌, పోస్ట్‌ ఆరఒఆర్‌ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, రీ సర్వేలో ఆయా దశలలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. 2022-23 రబి ఇ-క్రాప్‌ బుకింగ్‌ను, పిఎం కిసాన్‌ ఇకెవైసి కార్యక్రమాలను పటిష్టవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీలను భర్తీ చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.