Nov 09,2023 20:44

ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

ప్రజాశక్తి- దేవనకొండ
ప్రతి ఎకరాకూ సాగు నీరిచ్చే వరకు ఐక్య పోరాటం చేస్తామని వక్తలు పేర్కొన్నారు. హంద్రీనీవా నుంచి గుండ్లకొండ దగ్గర స్లూయిజ్‌ ఏర్పాటు చేసి కోటకొండ, మాచాపురం గ్రామాల వరకు సాగునీరివ్వాలని, మండలంలోని చెరువులన్నింటికీ హంద్రీ ద్వారా నీటిని నింపాలని రైతు సంఘం, వ్యకాస ఆధ్వర్యంలో చేపట్టిన 30 గంటల నిరవధిక దీక్షకు గురువారం టిడిపి, సిపిఎం జిల్లా నాయకులు, పలువురు ఎంపిటిసిలు సర్పంచులు మద్దతు తెలిపారు. నిరవధిక దీక్షకు మద్దతుగా టిడిపి ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి, వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి.నారాయణ, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు, వ్యకాస జిల్లా అధ్యక్షులు వీరశేఖర్‌, ఎంపిటిసిలు విజయ గౌడ్‌, తపాల శ్రీనివాసులు, వెలమకూరు సర్పంచి భాస్కర్‌ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేవనకొండ మండలం తీవ్ర కరువు ప్రాంతమని, కరువు పరిష్కారంగా హంద్రీనీవా వచ్చిందని తెలిపారు. 46 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ నిర్దిష్టంగా ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేకపోతోందని చెప్పారు. పంట కాలువలు తవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. అనేక మంది ప్రజలకు, గ్రామాలకు ఉపయోగకరంగా ఉండే గుండ్లకొండ దగ్గర హంద్రీనీవాకు స్లూయిజ్‌ ఏర్పాటు చేస్తే దాదాపు 10, 12 గ్రామాలకు సాగు నీరు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కరువు ప్రకటిస్తున్నా రైతులను నిర్దిష్టంగా ఆదుకునే చర్యలు లేవని తెలిపారు. ప్రతి ఎకరాకూ నీరిచ్చే అవకాశం ఉందని, సాగునీటిపై పాలకులకు, అధికారులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మండలంలోని నేలతలమరి, గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బంటుపల్లి, బేతపల్లి, బండపల్లి, చెల్లెల చెలిమిల, కోటకొండ గ్రామాల చెరువులకు హంద్రీనీవా ద్వారా నీటిని మళ్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రైతులు పలు దఫాలుగా మంత్రి, కలెక్టర్‌, సాగునీటి జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందజేశారని తెలిపారు. రైతుల సాగునీటి సమస్య, చెరువులకు నీళ్లు మళ్లించే అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని, రైతులు చేసే ఉద్యమాలకు తమ పూర్తి సహకారం, సంఘీభావం ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు, రైతు సంఘాలు, సిపిఎం చేసే ఆందోళనలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రత్యక్షంగా పాల్గొంటామని వారు పేర్కొన్నారు.
ఎంపిడిఒ కార్యాలయాన్నిముట్టడించిన రైతులు
సాగునీటి కోసం 30 గంటల నిరవధిక దీక్ష చేస్తున్నా వైసిపి ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సబబు కాదని, రైతుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం మంచిది కాదని ఎంపిడిఒ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. మండల సర్వసభ్య సమావేశం జరుగుతుండగా రైతు సంఘం, వ్యకాస ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడించారు. సాగునీరు, చెరువులకు నీళ్లు మళ్లించాలని రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. సాగునీటి కోసం తీర్మానం చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఎంపిపి లక్ష్మీదేవి, ఎంపిడిఒ గౌరీ దేవి, డిప్యూటీ తహశీల్దార్‌ సుదర్శనం, హంద్రీ నీవా జెఇ లక్ష్మీనారాయణ, ఎంపిటిసిలు, సర్పంచులు సమస్య పరిష్కారానికి సహకరిస్తామని తెలిపారు. సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేస్తూ ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు. దీక్ష విరమించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారుల హామీ మేరకు దీక్ష శిబిరం వద్దకు చేరుకొని నిరవధిక దీక్ష చేస్తున్న రైతులు, రైతు, వ్యకాస నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రైతుసంఘం మండల కార్యదర్శి సూరి, సిఐటియు మండల కార్యదర్శి అశోక్‌, పత్తికొండ నాయకులు దస్తగిరి, నాయకులు శ్రీనివాసులు, వీరేంద్ర, సుధాకర్‌, లింగన్న, నాగేష్‌, యూసుఫ్‌, మహేంద్ర, నాగేంద్ర, రాయుడు, లక్ష్మి రెడ్డి, గుండ్లకొండ, గుడిమరాళ్ల, బంటుపల్లి, కోటకొండ రైతులు వెంకటస్వామి, వెంకటరాముడు, కృష్ణ, కౌలుట్ల, శేషిరెడ్డి, శ్రీనివాసులు, దేవన్న, బయప్ప, కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, స్వాములు, మార్కండేయులు, గుడిమిరాళ్ల సర్పంచి శేషి రెడ్డి, వెలమకూరు సర్పంచి భాస్కర్‌, చెల్లెల చెలిమల, బేతపల్లి సర్పంచులు చిన్న రామప్ప, మహేశ్వర్‌ రెడ్డి సంఘీభావంగా పాల్గొన్నారు.

సంఘీభావం తెలుపుతున్న కోట్ల సుజాతమ్మ
సంఘీభావం తెలుపుతున్న కోట్ల సుజాతమ్మ