Jun 21,2023 19:37

నినాదాలు చేస్తున్న నాయకులు, కార్మికులు

నినాదాలు చేస్తున్న నాయకులు, కార్మికులు
పర్మినెంట్‌ చేసే వరకు పోరాటం ఆగదు
నెల్లూరు:నగర కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కార్మికులందరినీ ప్రభుత్వం పర్మినెంట్‌ చేసేవరకు తాము చేసే పోరాటం ఆగదని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అన్నారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నగర పరిధిలోని 44, 45, 46 డివిజన్ల పారిశుద్ధ్య కార్మికులు గాంధీ బొమ్మ సెంటర్లో నిరసన ధర్నాకార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ( సిఐటియు ) గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తానని ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అమలు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థలో పనిచేయుచున్న కార్మికులు వివిధ రకాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పిఎఫ్‌ ఈఎస్‌ఐ బెనిఫిట్స్‌ అందడం లేదన్నారు. చట్ట ప్రకారం వర్తించాల్సిన సెలవులు అమలు చేయడం లేదని అన్నారు.
అన్ని విభాగాల కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ కార్మికులకి స్కిల్డు, సెమిస్కిల్‌ జీతాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని,లేని పక్షంలో ఆందోళన ఉదతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్‌ సీనియర్‌ నగర కార్యదర్శి ఎం అశోక్‌, శ్రీకాంత్‌, మేరమ్మ,ఏడుకొండలు, మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు