ప్రజల గుండెల్లో సిఎంకు సుస్థిర స్థానం
ప్రజాశక్తి ఇందుకూరుపేట : రాష్ట్ర ప్రజల గుండెల్లో తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని ఎంఎల్ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని లేబూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లేబూరు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి గడపగడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గూర్చి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ శ్రీకారం చేయగానే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పేరుగాంచారన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుడికి నేరుగా ఖాతాలో నగదు జమయ్యే విధంగా చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు పెట్టిన మళ్లీ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చేసుకుంటారని ధీమా వ్యక్త పరిచారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజరు కుమార్యాదవ్, యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, గుణపాటి సురేష్ రెడ్డి, బట్టేపాటి నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడూరు ప్రభాకర్ రెడ్డి, పలు గ్రామాల నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










