ప్రజలతో మాట్లాడుతున్న కమిషనర్
ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి
-కమిషనర్ వికాస్ మర్మత్
నెల్లూరు:నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని కమిషనర్ వికాస్ మర్మత్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన స్థానిక మాగుంట లే అవుట్ డి మార్ట్ ప్రాంతంలో స్థానికుల ఆధ్వర్యంలో సెల్ ఫోన్ టవర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ టవర్ల నిర్మాణంతో స్థానికులకు వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, వాటిని తొలగించాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ, నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.అనంతరం స్థానిక బారా షాహిద్ దర్గాలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ తనిఖీ చేశారు. దర్గా ప్రాంగణంలో మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ ప్రాంగణాన్ని శుభ్ర పరిచేలా పర్యవేక్షించాలని కమిషనర్ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వసంతి, కో ఆప్షన్ సభ్యులు మొబీనా, ఇంజనీరింగ్ అధికారులు, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










