Feb 03,2023 22:07

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

గోరంట్ల : ప్రభుత్వం అందజేస్తున్న సేవలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే శంకరనారాయణ సూచించారు. పట్టణంలో ఎస్‌ ఎల్‌ వి ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం గ్రామ సచివాలయాల కన్వీనర్లు, గృహ సారధులు, వాలెంటీర్లతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అందిస్తున్న సేవలను కొత్తగా నియమించబడిన గృహ సారధులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లతో కలసి ప్రజలకు వివరించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ లక్ష్మీ నరసప్ప యాదవ్‌, జెడ్పీటీసీ జయరాం నాయక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ శంకర్‌ రెడ్డి, మైనార్టీ స్టేట్‌ డైరెక్టర్‌ ఫక్రుద్దీన్‌, మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌, సర్పంచులు ప్రభాకర్‌ రావు, నర్సిరెడ్డి, రామాంజనేయులు, నాగే నాయక్‌, శివ శంకర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్‌ హాల్‌ నందు మున్సిపాలిటీ లోని 13 నుండి 26వ సచివాలయాల పరిధిలో గృహ సారథుల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కదిరి నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర జానపద, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తున్నారన్నారు. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో గృహ సారధులు, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరికి సాదిక్‌, వైసిపి మాజీ సమన్వయకర్త ఎస్‌ఎండి ఇస్మాయిల్‌, వైస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌ రెడ్డి, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి ఆవుల వెంకటనారాయణ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.