ప్రజాశక్తి-రాయచోటి : జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ భూములు గుర్తించాలని కలెక్టర్ గిరిష తహశీల్దార్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భూ సేకరణపై రాయచోటి నియోజకవర్గంలోని తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుత రాయచోటి నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి డికెటి, ప్రభుత్వ భూములు గుర్తించి రెండు రోజుల లోపల తమకు రిపోర్టు పంపాలన్నారు. నియోజకవర్గంలోని రాయచోటి, సంబేపల్లి, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చిన్నమండెం మండలాలకు సంబంధించి సర్వే నెంబర్ల వారీగా గుట్టలు మినహా అందుబాటులో ఉన్న అనువైన భూములు గుర్తించాలని తెలిపారు. కార్యక్రమాన్ని తహసిల్దార్లు, సర్వేయర్లు సీరియస్గా తీసుకొని త్వరితగతిన భూ సేకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయ, రాయచోటి ఆర్డిఒ రంగస్వామి, రాయచోటి నియోజకవర్గంలోని తహశీల్దార్లు పాల్గొన్నారు.










