Jul 12,2021 09:50

పెదవాల్తేరు : ఫోన్‌సిగ్నల్స్‌ ఆధారంగా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన పెదవాల్తేరులో జరిగింది. ఆత్మహత్యకు యత్నించిన ఉద్యోగి ఫోన్‌ సిగ్నల్స్  ఆధారంగా అతని ప్రాణాలు కాపాడినట్లు పోలీసులు తెలిపారు. సి.ఐ. కె.ఈశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.చైతన్యవర్మ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శనివారం సాయంత్రం 6 గంటలకు అతని స్నేహితుడు అనకాపల్లి పోలీసులకు సమాచారమిచ్చాడు. అనకాపల్లి పోలీసులు ఆ సెల్‌ఫోన్‌ ఏరియాను ట్రేస్‌ చేయగా.. విశాఖ రామ్‌నగర్‌లో ఉన్నట్లు తెలిసింది. అనకాపల్లి పోలీసులు విశాఖ మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై రాము ఆధ్వర్యంలో సిబ్బంది సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను గుర్తిస్తూ రామ్‌నగర్‌లోని పలు హోటళ్లలో గాలించారు. 8.20 గంటల సమయంలో చైతన్యవర్మ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అప్పటికే అతను అపస్మారక స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ కేసును విచారణ చేస్తున్నట్లు తెలిపారు.