Feb 06,2023 22:00

ఫొటో : పరిశీలిస్తున్న జెసి రోణంకి కూర్మానాథ్‌

పంటలను పరిశీలించిన జెసి
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలో ఇటీవల వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ క్రాఫ్ట్‌ పంట నమోదుచేసిన నందవరం, పొంగూరు గ్రామాలలోని పంటలను సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ రోణంకి కూర్మనాధ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్‌ చెక్‌ను ప్రభుత్వం కలెక్టర్‌, జెసి, ఆర్‌డిఒ, తహశీల్దార్‌కు అప్పగించారన్నారు. పొంగూరులో రైతు పార్లపల్లి కృష్ణారెడ్డి 347సెంట్లలో శనగ పంటవేశారని గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఈ క్రాఫ్ట్‌ పంట నమోదు చేశారని తెలిపారు. సూపర్‌ చెక్‌ ప్రకారం అదే సర్వే నెంబర్‌లో వారు నిజంగా పంట నమోదు ప్రక్రియ చేశారా లేదా అని జెసి పరిశీలించారు.
ఈ క్రాఫ్ట్‌ నమోదు పూర్తయిన తర్వాత అధికారులకు ఇచ్చారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రాఫ్ట్‌ పంట నమోదులో చాలా అవకతవకలు జరిగి పేమెంట్స్‌ ఆపి గ్రామ వ్యవసాయ సహాయకులు, ఇతర అధికారుల మీద చర్యలు తీసుకున్నామన్నారు. పంట నమోదు ప్రక్రియలో అవకతవకలు జరగరాదని రైతుకు అన్యాయం జరగకూడదని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేశారో.. పంట నిజంగా ఉందా లేదా సూపర్‌చెక్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అనంతరం మండలం నందవరంలో పంట నమోదు ప్రక్రియ సరిగా జరుగలేదని అధికారులపై జెసి రోణంకి కూర్మనాధ్‌ మండిపడ్డారు. ఒక సర్వే నెంబర్‌లో నమోదు చేయాల్సిన పంటను జామాయిల్‌ పంట ఉన్న సర్వే నెంబర్‌లో పచ్చి శనగ వేసినట్లు సూపర్‌ చెక్‌ చేయడంతో గ్రామ వ్యవసాయ సహాయకురాలు, విఆర్‌ఒ సెక్రెటరీని జెసి మందలించారు. పొలం సర్వే నెంబర్లు తప్పులు తడకగా ఉన్నందున వేలిముద్ర ఎలా వేస్తావని విఆర్‌ఒపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటకోత సమయం దగ్గర పడుతున్నందున ఎప్పుడు పంట క్రాఫ్ట్‌నమోదు చేస్తారని ప్రశ్నించారు. ప్రతి రైతుకు ఇన్పుట్‌ సబ్సిడీ, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసినప్పుడు ఏ రైతు ఏ సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణం కలిగి ఉన్నారో గుర్తించరా అని ప్రశ్నించారు. ఆయనవెంట తహశీల్దార్‌ హేమంత్‌ కుమార్‌, ఆర్‌ఐ సురేంద్ర, వ్యవసాయాధికారి రామ్మోహన్‌, వ్యవసాయ విస్తరణాధికారి వెంకటేశ్వర్లు, విఆర్‌ఒ తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.