ప్రజాశక్తి - ముదిగుబ్బ: పంటసాగు చేసి నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. మండలం కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్లో టిడిపి రైతు నాయకులు ఆధ్వర్యంలో ఎన్టీర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం రోడ్డు పై ఆందోళనకు దిగారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహశీల్దార్ ప్రసన్నకుమార్, అగ్రికల్చర్ ఆఫీసర్ నరసింహులుకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు రమేష్ బాబు, అన్నమనేని ప్రభాకర్, తుమ్మల మనోహర్, తుమ్మల సూరి, కృష్ణమూర్తి యాదవ్ , తెలుగు మహిళా రాధమ్మ , ధర్మవరం నియోజకవర్గ మండల కన్వీనర్లు గోనుగుంట్ల విజరు కుమార్ , కమతం కాటమయ్య, గంటాపురం జగ్గు తదితరులు పాల్గొన్నారు.
ఓబుల దేవర చెరువు : మండలంలో పంటలు నష్టపోయిన రైతులకు బీమా వర్తింపజేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కదిరి హిందూపురం ప్రధాన రహదారిపై టిడిపి నాయకులు కార్యకర్తలు రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెబుతూనే రైతులకు బీమా వర్తింప చేయకుండా అన్యాయం చేయడం దారుణం అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి పంటలు నష్టపోయిన రైతులకు బీమా వచ్చేటట్లు చూడాలని డిమాండ్ చేశారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎఒ ఇలియాజ్కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయచంద్ర, పీట్ల సుధాకర్, డాక్టర్ జాకీర్, బడిశం రామాంజనేయులు, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










