పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలి : సిపిఎం
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్కు రూ.50 పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి, సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు షేక్ గుల్జర్ బేగం పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి మాట్లాడుతూ ఇప్పటికే నిత్యవసర ధరలు, పెట్రోల్ డీజిల్, కరెంట్ ఛార్జీలు వీరికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 460 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు రూ.750లకు గ్యాస్ ధర పెంచి అడ్డు అదుపు లేకుండా పేద ప్రజలపై ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. ఈ ధరల ప్రభావం వలన చాలీచాలని తిండి తిని జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమర్షియల్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగిన దాని వల్ల చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. దాని ప్రభావం ప్రజలపై పడిందని, కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో ఎలక్షన్ అయినంత వరకు ధరలు పెంచకుండా తర్వాత ధరలు పెంచడం అన్యాయమని దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా పెంచిన ధరలు తగ్గించాలని లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.










