Feb 10,2023 20:59

- జగనన్న కాలనీల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి : పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నిజం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంబేపల్లి మండలం గుణ్ణికుంట్ల గ్రామంలోని జాందీగారిపల్లె, చౌటపల్లెలకు సంబంధించి జగనన్న కాలనీలో నిర్మాణాలలో ఉన్నగృహాలను శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలో పూరిగుడిసె లేకుండా చేయడం జరిగిందన్నారు. తండ్రి స్పూర్తితో సిఎం జగన్‌ పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. దేశచరిత్రలో ఎవ్వరూ చేయనివిధంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలను సేకరించి, ఆ ఇళ్ల పట్టాలను అత్యంత పారదర్శకంగా పంచి, వేగంగా ఇళ్ల నిర్మాణాలును జగనన్న ప్రభుత్వం జరిపిస్తోందన్నారు. ఇళ్లు కాదు అవి ఊళ్ళు అనిపించేలా కాలనీలును ఆదర్శవంతంగా నిర్మించడంతో పాటు తాగునీరు, సిమెంట్‌ రహదారులు, డ్రెయినేజీలు, విద్యుత్‌ సౌకర్యం తదితర మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. గుణ్ణికుంట్ల గ్రామంలోనే 95 గృహాలు మంజూరు అయ్యాయని, నిర్మాణాలు వివిధ దశల్లో ఉండడం హర్షదాయకమన్నారు. సంబేపల్లె మండలంలో 17 జగనన్న కాలనీలలో పక్కా గృహాల నిర్మాణాలు చురుగ్గా సాగుచున్నాయన్నారు. ఆయన వెంట వైసిపి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.